<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

రెంటికి చెడ్డ రేవడి

Tuesday, September 14, 2010

మహాభారత సంగ్రామంలో ఎవరి పక్షాన చేరకుండా ఉండిపోయింది ఇద్దరు వ్యక్తులు . బలరాముడు, రుక్మి. బలరాముడు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే శాంతికాముకుడు. మహాజన క్షయకరమైన కురుపాండవ యుద్ధం అతనికి ఇష్టం లేదు. తమ్ముడంటే అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కౌరవుల పతనం అతనిని అమితంగా కలత పెట్టింది.. అన్నదమ్ములు ఒకరినొకరు శత్రువుల్లా చంపుకోవడం ఆయనకు చాలా బాధ కలిగించింది. అందుకే తీర్థయాత్రల  పేరుతో సరస్వతీ నదీతీరానికి వెళ్లిపోయాడు.

భీష్మక మహారాజు కుమారుడు , శ్రీకృష్ణుని దేవేరి రుక్మిణిదేవి సోదరుడు రుక్మి మిక్కిలి పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు కూడా. అతను ధ్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల "విజయం"అనే దివ్య ధనుస్సు సంపాదించాడు. లోకంలో అత్యంత శ్రేష్టమైన దివ్య ఆయుధాలు మూడే ఉన్నాయి. దేవతల ధనుస్సులు ఏవీ వాటికి సరిరావు. వాటిలో ఒకటి విష్ణుమూర్తి "శార్ఞం" అనే ధనువు శ్రీకృష్ణుడు ధరించాడు. మరొకటి ఖాండవవన దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి బహూకరించిన "గాండీవం". మూడవది రుక్మి దగ్గరున్న "విజయం".  గతంలో రుక్మిణీదేవిని ఎత్తుకెళ్తున్న కృష్ణుడిని ఎదిరించి అవమానాలపాలయ్యడు రుక్మి.

మహాభారత సంగ్రామ జరగడం తథ్యం అని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల వద్దకు వెళ్లాడు రుక్మి. అతిథి మర్యాదలు స్వీకరించిన పిమ్మట అర్జునుడిని పిలిచి "అర్జునా! రాబోయే మహాసంగ్రామం గురించి భయపడకు. నన్ను మించిన వీరుడు, పరాక్రమవంతుడు లేడు. నా వద్ద శక్తివంతమైన ధనుస్సు ఉంది. దాని సహాయంతో భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది మహావీరులని మట్టి కరిపించి నీ రాజ్యం నీకు అప్పగిస్తాను" అని బీరాలు పలికాడు. అదివిని అర్జునుడు నవ్వుకుని " మహావీరా! మాకు సహాయం చేస్తానన్నందుకు దన్యవాదాలు.  నీకు తెలుసు కదా మాకు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు అండగా ఉన్నాడు. ఆయన ఉండగా ఇక వేరేవారి సాయం అవసరం ఉంటుందా? పైగా నా దగ్గర గాండీవం ఉంది. ఆ ఇంద్రుడే వచ్చినా నేను భయపడను " అన్నాడు. అది విన్న రుక్మి కోపంతో తన సేనతో   సుయోధనుడి దగ్గరకు వెళ్లాడు.

"దుర్యోధనా! నేను నీ పక్షాన ఉంటాను. నా ధనుస్సుతో పాండవులను అంతం చేసి స్వర్గానికి చేరుస్తాను. నీకు విజయం తథ్యం. నా ప్రతాపం చూపిస్తాను" అన్నాడు రుక్మి. అభిమానధనుడైన రారాజు అతడిని సున్నితంగానే నిరాకరించాడు. ఇక చేసేది లేక రుక్మి  సిగ్గుతో వచ్చినదారినే తన నగరానికి వెనుదిరిగాడు.

అందుకే ఎప్పుడు కూడా తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్ని, శక్తిని తక్కువగా అంచనా వేయడం ఎవరికి మంచిది కాదు. అలా చేయడం వల్ల అవమానమే తప్ప వేరే ఫలితం ఉండదు.

Labels:

posted by జ్యోతి, 5:25 AM | link | 2 comments |