<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

అష్టావక్రుడు

Monday, October 8, 2007

వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలక మహర్షి. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాల బుద్ధిమంతుడు, గుణవంతుడు, నీతినియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపం ఉంది. నిలకడ లేదు మనిషికి. అందుకని ఏ విద్యా పూర్తిగా నేర్చుకోలేకపోయాడు.

అయినప్పటికీ ఉద్ధాలకుడు అతని మీద ప్రేమతో తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు. కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో వున్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు. అవి అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడన్న పేరు వచ్చింది.

అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు.ఒకసారి జనక మహారాజు మిధిలా నగరంలో పెద్దయాగం చేస్తున్నాడని తెలిసి , తన బంధువూ, మిత్రుడూ అయిన సువేదకేతువును వెంటపెట్టుకుని అష్టావక్రుడు మిధిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో "నాయనలారా! గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు, ఉపనిషత్తులు చదువుకున్న విద్వాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే -రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది శాస్త్రం చెబుతోంది. " అన్నాడు.

ఈ వాదం రాజుగారికి తెలిసి ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి "నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన భేదం లేదు. కాలుతుంది. కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్ధండుడిలా వున్నాడు" అనుకుని ఆ బాలకులను లోపలికి పంపమని భటుల్ని ఆదేశించాడు. కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు. వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు.

"మేం చిన్నపిల్లలం కాము, వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవరిని పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు_ జ్ఞానం చేత పండినవారే వృద్ధులు . తెలివి ఉన్నవాడే మనిషి" అని ప్రవచించాడు అష్టావక్రుడు.

అంతట రాజుగారు అక్కడికి వచ్చి , " మా పండితులందరూ మహా విద్వాంసులు. అటువంటివాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు తెలీదు. ఒకవేళ నీవు ఆ వాదంలో ఓడిపోతే నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు.

"మహారాజా! మీరు చెప్పినదానికి నేను ఒప్పుకుంటున్నాను.కాని వాళ్ళు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమని, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో వున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను.మీ పండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. "అని కోరాడు అష్టావక్రుడు.

అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. అష్టావక్రుడు గెలిచినట్తు ప్రకటించారు. పందెం ప్రకారం ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.

కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయంకృషితో పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు. పండితుడి కడుపున పరమ శుంఠ జన్మించవచ్చు. దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు. కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవర్నీ అంచనా వేయకూడదు.

Labels:

posted by జ్యోతి, 4:14 PM | link | 2 comments |