కాకి - హంస
Thursday, August 9, 2007
ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు. ఆ హంసల కంటే ఎత్తుగా ఎగరగలవా? "అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ కాకి తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి."మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరితూగగలిగే కాకులు ఉన్నట్టు ఎప్పుడైనా విన్నావా . చూసావా??" అన్నాయి. "నూటొక్క గతులలో పరుగెత్తడం నాకు చేతనవును. ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనలు వెళతాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం " అంది కాకి. "ఆ గతులు, గమనాలు మాకు తెలీదు.మామూలుగా సముద్రం మీద ఎగురుదాం. మేమంతా వద్దు కాని మాలో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.
ఒక హంస, కాకి రెండూ సముద్రం మీదుగా ఎగరటం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి మాత్రం విన్యాసాలు చేయసాగింది.హంసను దాటిపోయి వెనక్కి తిరిగి హంసను వెక్కిరించడం,ముక్కు మీద ముక్కు పెట్టడం, జుట్టు రేపుకుని, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులు చేసింది. హంస అవన్ని పట్టించుకోక ఊరకుంది. కాసేపటికి కాకి అలిసిపోఉయింది. హంస పొడుగ్గా ఎగిసి పడమరకు పరుగెత్తింది. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమోహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. "అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి కాసేపు ఆగుదామంటే పర్వతాలు, చెట్లు కూడా లేవు. ఈ సముద్రంలో పడితే మరణమే గతి" అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది.
అది చూసి "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేసావు. ఒక్కటీ చూపవేమి వాయసరాజమా?" అంది హంస. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా ఉంది. "ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నూ మిన్నూ గానక నాకెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతులనయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిప్పుడు తెలిసింది. నాయందు దయ చూపి నను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడిన హంస తన కాళ్ళతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది."ఇంకెప్పుడు గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస.
కాకి లెంపలేసుకుంది.
"అలాగే - వైశ్యపుత్రుల ఎంగిళ్ళు తిన్న కాకిలాగా నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా!! హెచ్చులకు పోకు" అని కర్ణుని రథసారథి పాండవుల మేనమామ శల్యుడు యుద్ధ రంగంలో అతడిని హెచ్చరించాడు.
Labels: క
కర్ణుడి తొడను తొలచిన కీటకం ఎవరబ్బా?
Friday, March 2, 2007
పరశురాముడు కర్ణుడి తొడ మీద నిద్ర పోతుండగా ఒక కీటకం అతడి తొడని తొలవటం తెలిసిందే కదా? కర్ణుడికి వున్న సవాలక్ష శాపాలలో ఒకటి దాని వలన వచ్చినదే. పరశురాముడు క్షత్రియ విద్వేషి. అందువలన అతడు క్షత్రియులకు విద్య నేర్పడు.బ్రాహ్మణులకు మాత్రమే నేర్పుతాడు. కానీ కర్ణుడు తను బ్రాహ్మణ పుత్రుడని చెప్పుకోవడంతో అతనికి నేర్పాడు.
అది అలా వుంచితే…ఈ పురుగు పేరు "అలర్కము". ఇది తొలవటం వలన కారిన రక్తం తగిలి, పరశురాముడు లేచి ఆ పురుగును గమనించాడు. వెంటనే ఆ పురుగుకు శాప విమోచనం కలిగి త్రాగ్దంశుడు అనే దనుజుడిగా మారి మరణించాడు.
ఆ వెంబడనే, కర్ణుడు తప్పని సరిగా క్షత్రియుడై వుంటాడని, బ్రాహ్మణుడికి ఇలా నిబ్బరంగా బాధను భరించడం రాదని నిర్ధారించుకుని అతనికి నేర్పిన బ్రహ్మాస్త్రం మొదలైనవి ఏవీ అవసర సమయంలో పనికిరావు అని శాపమిచ్చాడు. కర్ణుడి చావుకున్న సవాలక్ష కారణాలలో ఇదొకటి...